ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ అయిన ఆయన ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులు కలిగిన వాహనం కలకలం రేపడం, ఈ కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజేపై ఆరోపణలు రావడం, సచిన్ వాజేను వంద కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అడిగారంటూ బదిలీ అయిన ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆరోపిస్తూ సిఎం ఉద్ధవ్కు లేఖ రాయడం వంటి అంశాలతోపాటు మరికొన్నింటిని అందులో పేర్కొన్నారు.
శాంతిభద్రతల విషయంలో మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని రామ్దాస్ అథవాలే విమర్శించారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి అధ్యక్ష పాలన విధించాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. ఈ మేరకు ఒక లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి పంపినట్లు ఆయన ట్వీట్ చేశారు.