ముంబై : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్ట్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనను అరెస్ట్ చేశారని శివసేనపై కేంద్ర మంత్రి రాణే మండిపడ్డారు. అధికారం చూసుకుని శివసేన చెలరేగుతోందని, ఆ అహంకారంతోనే తనను అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
కొవిడ్-19 నియంత్రణలో మహారాష్ట్ర విఫలమైందని, వైరస్ కట్టడికి ఠాక్రే సర్కార్ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్పుట్ హత్యోదంతం, దిశా సలియన్ హత్యాచార ఘటనలో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఎత్తిచూపారు. తన ఇంటి వద్దకు వచ్చిన శివసైనికులకు పోలీసులు స్వాగతం పలికారని దుయ్యబట్టారు. తనపై చర్యలు చేపడితే తాను భయపడతానని శివసేన నేతలు భావిస్తున్నారని, కానీ తన ప్రయాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.