న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి క్రమం తప్పకుండా పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. వారం రోజులకుపైగా అంటే దాదాపు గత 10 రోజుల నుంచి పెట్రో ధరలు పెరుగకుండా నిలకడగా ఉన్నాయి. రెండు నెలలకుపైగా జనాన్ని బెంబేలెత్తించిన పెట్రో ధరలకు ఉన్నట్టుండి బ్రేక్ పడటానికి కారణం ఏమై ఉంటుంది..? పుదుచ్చేరి సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగానే ధరల పెంపునకు బ్రేక్ పడిందా..? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలను ధరలు పెంచకుండా నియంత్రించిందా..? అంటే ఔననే సమాధానం వస్తున్నది. వివిధ జాతీయ పత్రికల్లో ప్రచురితమైన నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
జనవరి నెల నుంచి విరామం లేకుండా పెరిగి సామాన్యుడి నడ్డి విరిచిన పెట్రో ధరలు గత 9 రోజులలో ఒక్క రూపాయి కూడా పెరుగలేదు. గత రెండు నెలల వ్యవధిలో వరుసగా తొమ్మిది రోజులు పెట్రో ధరలు పెరుగని సందర్భమే లేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సర్కారే జోక్యం చేసుకుని చమురు సంస్థలను నియంత్రించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి.
2018 లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇంధన ధరలు వేగంగా పెరిగాయి. ఏకంగా 55 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఇంధన రిటెయిలర్లు ఎన్నికల సమయమైన ఏప్రిల్ 24 నుంచి మే 13 వరకు 19 రోజులపాటు ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచారు. పోలింగ్ ముగిసిన రెండు రోజులకే తిరిగి ధరల వడ్డన పునఃప్రారంభించారు. అయితే, ఆయిల్ కంపెనీలు మాత్రం ప్రభుత్వాల జోక్యం ఉండవచ్చునన్న వాదనను కొట్టిపారేస్తున్నాయి. ప్రజా ప్రయోజనార్థమే ధరలు నిలువరించినట్లు చెబుతున్నాయి.