రాష్ట్రంలో టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. కేంద్రం నుంచి తగినన్ని డోసులు రాని కారణంగా రాష్ట్రంలో టీకాల కొరత ఏర్పడింది. దీంతో ఆదివారం వ్యాక్సినేషన్ను నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఓవైపు రోజూ లక్షన్నర మందికిపైగా టీకాలు వేస్తూ.. మరోవైపు లక్షకుపైగా టెస్టులు చేస్తున్నది. కానీ రాష్ర్టానికి టీకాలను పంపించడంలో కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదు. దీంతో టీకాల పంపిణీకి అంతరాయం తప్పలేదు. ఆదివారం 2.7 లక్షల డోసులు పంపిస్తామని కేంద్రం చెప్తున్నా.. అవి సెకండ్ డోస్కు మాత్రమే సరిపోతాయని అధికారవర్గాలు తెలిపాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రం తగినన్ని టీకాలు పంపిణీ చేయకపోవడంతో రాష్ట్రంలో టీకాల పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా విజృంభిస్తుండటంతో ఇన్నాళ్లూ ఆదివారం, సెలవు రోజుల్లోనూ టీకాలు వేశారు. అయితే ఇప్పుడు టీకాలు నిండుకోవడంతో అంతరాయం తప్పలేదు. కేంద్రం నుంచి రాష్ర్టానికి ఇప్పటివరకు 30.7 లక్షల డోసుల టీకాలు మాత్రమే వచ్చాయి. కేంద్రం పంపిణీ చేసిన మొత్తం టీకాల్లో ఇది కేవలం 2.1 శాతమే. ఈ జాబితాలో తెలంగాణ 17వ స్థానంలో ఉన్నది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు శుక్రవారం నాటికి మొత్తం 28 లక్షల మందికి టీకాలు వేశారు. శనివారం వ్యాక్సినేషన్ తర్వాత కేవలం 1.5 లక్షల డోసులే అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక్క రోజుకు కూడా సరిపోవు. దీంతో ఆదివారం ప్రభుత్వ కేంద్రాల్లో టీకా పంపిణీని నిలిపివేశారు. కేంద్రం నుంచి ఆదివారం సుమారు 2.7 లక్షల డోసులు రానున్నాయని సమాచారం ఇచ్చారు. ఇవి ఇప్పటికే మొదటి డోస్ వేసినవారికి సెకండ్ డోస్ వేసేందుకు సరిపోతాయని అధికారులు అంటున్నారు. దీంతో మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డంకులు తప్పేలా లేవు. ఫలితంగా రాష్ట్రంలో కరోనాను నియంత్రించాలని తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది కేంద్రం వైఖరితో నిరాశ చెందుతున్నారు.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ భారీ ఎత్తున చేపట్టామని, దానికి తగినట్టు టీకాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కేంద్రాన్ని కోరుతున్నది. అయినా కేంద్రం కొండంత అడిగితే గోరంత విదిలిస్తున్నది. ఇటీవల 30 లక్షల డోసులు ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం మాత్రం కేవలం 4 లక్షల డోసులు పంపిణీ చేసింది. అవి కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరో 2.7 లక్షల డోసులు పంపిస్తామని అంటున్నది. ఇవి ఒక్క రోజుకే సరిపోతాయని తెలిసినా కేంద్రం వివక్ష ప్రదర్శించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల్లో 50 శాతం కేవలం ఆరు రాష్ర్టాలకే చేరాయి. ఆయా రాష్ర్టాల్లో పదుల లక్షల డోసులు స్టాక్ ఉండటం గమనార్హం. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 2.67 కోట్ల డోసులు నిల్వ ఉండగా, ఇందులో 98.2 లక్షలు ఈ ఆరు రాష్ర్టాల్లోనే ఉన్నాయి. 37 శాతం స్టాక్ ఆరు రాష్ర్టాల్లోనే ఉన్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని తెలంగాణకు తగినన్ని డోసులు పంపిణీ చేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం నుంచి వ్యాక్సి న్ డోసులు వస్తే సోమవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1.75 లక్షల మందికి టీకాలు వేశారు. ఇందులో 1.61 లక్షల మంది తొలిడోస్ తీసుకోగా, 13,833 మంది రెండో డోస్ తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 28.01 లక్షల మందికి టీకాలు వేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అందరికీ పెద్దన్నగా నిలవాల్సిన కేంద్రం.. టీకాల పంపిణీలో నిర్లక్ష్యం చూపుతున్నది. జనాభా ప్రాతిపదికన లేదా కరోనా పరిస్థితుల ఆధారంగా టీకాలను పంపిణీ చేసి ఆదుకోవాల్సింది పోయి బీజేపీ పాలిత రాష్ర్టాలకు, ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు ఎక్కువ డోసులు పంపిణీ చేసింది. జనాభా, అందజేసిన టీకాల నిష్పత్తిని పరిశీలించినప్పుడు గుజరాత్కు అగ్రతాంబూలం ఇచ్చింది. ఆ రాష్ట్ర జనాభాలో 16.4 శాతం మందికి సరిపడా టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం కేరళకు టీకాల వరద పారింది. ఈ జాబితాలో తెలంగాణ 20వ స్థానంలో నిలిచింది. తెలంగాణకు పంపిణీ చేసిన టీకాలు కేవలం 6.3 శాతం మంది జనాభాకే సరిపోతాయని నిపుణులు లెక్కగట్టారు. జార్ఖండ్, ఒడిశా, గోవా వంటి చిన్న రాష్ర్టాలు, ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ర్టాలు ఈ జాబితాలో తెలంగాణ కన్నా ముందుండటం కేంద్రం తీరుకు అద్దం పడుతున్నది.
రాష్ట్రం చేరిన మొత్తం ప్రస్తుత నిల్వ డోసులు టీకాల్లో శాతం
ఉత్తరప్రదేశ్ 1.44 కోట్లు 9.86% 35.62 లక్షలు
మహారాష్ట్ర 1.31 కోట్లు 9.01% 14.98 లక్షలు
రాజస్థాన్ 1.22 కోట్లు 8.39% 13.20 లక్షలు
గుజరాత్ 1.16 కోట్లు 7.95% 12.38 లక్షలు
పశ్చిమబెంగాల్ 1.10 కోట్లు 7.59 % 22.02 లక్షలు