హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పట్టణాలు, నగరాల్లో విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పురపాలక సంస్థల పరిధిలో పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థాలను రెండు రోజులు (శ్రీరామనవమి)లోగా తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కరోనా, అంటువ్యాధుల వ్యాప్తి నిరోధానికి సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని స్ప్రే చేయాలని చెప్పారు. జనసంచారం అధికంగా ఉండే మార్కెట్లు, బస్స్టేషన్లు, రిక్రియేషన్ సెంటర్లు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక ప్రాధాన్యతతో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం డిసిన్ఫెక్టెంట్లు స్ప్రేచేయాలని చెప్పారు. సోషల్మీడియా ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ల ద్వారా ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వీటిపై మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్నారని అరవింద్కుమార్ స్పష్టంచేశారు. రానున్న రెండు రోజుల్లో పారిశుద్ధ్యం నిర్వహణలో మెరుగైన ఫలితాలు ఉండాలని, వీటిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని చెప్పారు. శ్మశాన వాటికల నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలోని ఐలా పరిధిలో రహదారులవెంట పేరుకపోయిన చెత్తకుప్పలను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఆ సంస్థ ఎండీని ఆదేశించారు. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, పైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బాలానగర్, కాప్రా ఐలాల్లోని రహదారుల వెంట ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా వీధి వ్యాపారాలు సాగుతున్నాయని చెప్పారు. ఐలా పరిధిలో కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో డీఎంఏ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.