న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఇవాళ దేశవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కొవిడ్ మార్గదర్శకాల మేరకు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలు తెరిచి ఆఫ్లైన్ బోధన మొదలుపెట్టగా.. తాజాగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇవాళ్టి నుంచి ఆఫ్లైన్ బోధన మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Dharmendra Pradhan ) పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి..? ఇంకా ఏయే రాష్ట్రాల్లో స్కూళ్లను ప్రారంభించాల్సి ఉంది..? కరోనా మహమ్మారి పరిస్థితి ఎలా ఉంది తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అదేవిధంగా ఈ నెల చివరికల్లా దేశంలోని అన్ని పాఠశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా రోడ్మ్యాప్ సిద్ధం చేయడంలో సాధ్యాసాధ్యాలపై కూడా సమావేశంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చర్చించారు.