న్యూఢిల్లీ: ప్రత్యక్ష పద్ధతిలో దాదాపు ఏడాది తర్వాత కేంద్ర మంత్రివర్గం భేటీ కానున్నది. ప్రధాని మోదీ ఈ భేటీకి అధ్యక్షత వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్నది. కరోనా వైరస్, లాక్డౌన్ వల్ల గత ఏడాది నుంచి కేంద్ర క్యాబినెట్ కేవలం వర్చువల్ రీతిలోనే భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రత్యక్ష భేటీ గత ఏడాది చివరిసారి ఏప్రిల్లో జరిగింది. అయితే అప్పటి నుంచి వీడియోకాన్ఫరెన్స్ రూపంలో మాత్రమే మంత్రులు కలుసుకుంటున్నారు. మంత్రిమండలితో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా భేటీకానున్నారు. జూలై ఏడవ తేదీన క్యాబినెట్ను విస్తరించిన విషయం తెలిసిందే. కొత్తగా మంత్రిమండలిలో 43 మంది చేరారు. 19 నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో క్యాబినెట్ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకున్నది.