న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వైఫల్యంతోనే దేశంలో మరోసారి లాక్డౌన్ విధించే పరిస్థితులు తలెత్తాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం రాహుల్ లేఖ రాశారు. ప్రభుత్వానికి కరోనా టీకా విషయంలో స్పష్టమైన వ్యూహం లేకపోవడం, వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ మహమ్మారిపై విజయం సాధించినట్లు ప్రకటించడమే దేశాన్ని అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంచాయన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో వినాశకరమైన జాతీయ లాక్డౌన్ అనివార్యమైందని విమర్శించారు. కొవిడ్ సునామీ దేశాన్ని నాశనం చేస్తూనే ఉన్నందున.. అడ్డుకట్ట వేసేందుకు శక్తిమేర చేయగలిగిన ప్రతీదాన్ని చేయాలని కోరారు.
లాక్డౌన్ విధింపుతో ఆర్థిక వ్యవస్థపై కలిగే ప్రతికూల ప్రభావంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలుసునని.. అయితే, వైరస్ వ్యాప్తితో పౌరులు విషాదకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది లాక్డౌన్ తరహా ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం బలహీన వర్గాలకు ప్రభుత్వం కరుణతో ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆహారాన్ని అందించాలన్నారు. అలాగే రవాణా వ్యూహాన్ని సిద్ధం చేయాలని సూచించారు. దేశ ప్రజలందరికీ వేగంగా టీకాలు వేయాలని, కరోనా విషయంలో పారదర్శకంగా ఉండి పరిశోధన వివరాలను ప్రపంచానికి తెలుపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.