న్యూఢిల్లీ: రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది. రైల్వేశాఖ కోసం ప్రత్యేకంగా 5 మెగాహెట్జ్ 4జీ స్పెక్ట్రమ్ను కేటాయించారు. ఇవాళ కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ, 5జీ స్పెక్ట్రమ్ అమలు కోసం రానున్న అయిదేళ్లలో 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 5 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను రైల్వే శాఖకు 700 MHz బ్యాండ్లో కేటాయించనున్నారు. దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడమే కాకుండా రైలు ప్రయాణాలు మరింత సురక్షితం అవుతాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం రైల్వేశాఖ ఆప్టికల్ ఫైబర్ను మాత్రమే వినియోగిస్తోందన్నారు. స్పెక్ట్రమ్ అందుబాటులోకి రావడం వల్ల రేడియో కమ్యూనికేషన్ కూడా రైల్వేశాఖ వాడే వీలుంటుందన్నారు.