న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధిరేటును పలు రేటింగ్ ఏజెన్సీలు తగ్గిస్తున్న క్రమంలో తాజాగా గ్లోబల్ రేటింగ్స్ దిగ్గజం ఎస్అండ్పీ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 11 శాతం నుంచి 9.5 శాతానికి కుదించింది. కొవిడ్-19 తదుపరి వేవ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉందని కూడా ఎస్అండ్పీ హెచ్చరించింది.కరోనా సెకండ్ వేవ్తో ఏప్రిల్-మేలో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కఠిన నియంత్రణలు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు కుదేలవడంతో వృద్ధి రేటు అంచనాలో కోత విధించినట్టు ఎస్అండ్పీ వెల్లడించింది.
ఇక 2023 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. ఇక ఇప్పటివరకూ దేశ జనాభాలో కేవలం 15 శాతం జనాభాకే కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేయడంతో తదుపరి కరోనా వేవ్ల ప్రభావం ఆర్థిక కార్యకలాపాలపై ఉంటుందని ఎస్అండ్పీ హెచ్చరించింది. కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 7.3 శాతం తగ్గిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాలో రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవల భారీ కోత విధించింది.