న్యూఢిల్లీ : అస్వస్ధతతో బాధపడుతున్న అండర్వరల్డ్ డాన్ చోటా రాజన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. జులై 27న అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరిన రాజన్ అప్పటినుంచి చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. దేశ చట్టాలను గౌరవించని రాజన్కు బెయిల్ మంజూరు చేయరాదని బాంబే హైకోర్టుకు బుధవారం సీబీఐ నివేదించిన అనంతరం ఆయన అస్వస్ధత సమాచారం వెల్లడికావడం గమనార్హం.
అండర్వరల్డ్ డాన్ పలు కేసుల్లో విచారణను ఎదుర్కొంటుండగా మరికొన్ని కేసుల్లో దోషిగా నిర్ధారణవడంతో శిక్ష విధించారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరట్ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి అనూజ ప్రభుదేశాయ్ దృష్టికి తీసుకువెళ్లారు. రాజన్ గతంలో నకిలీ పాస్పోర్టులు, మారుపేర్లతో పలు దేశాలకు పారిపోయాడని ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.
రాజన్ను నవంబర్ 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేసి భారత్కు తరలించారు. దేశానికి రాజన్ను రప్పించినప్పటి నుంచి ఆయన తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఓ హోటల్ వ్యాపారిపై హత్యాయత్నం కేసులో రాజన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది.