వాషింగ్టన్: ఇండియాలో కరోనా కట్టడి విషయంలో మోదీ సర్కార్ అవలంభిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టింది ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్. ఒక రకంగా మోదీ సర్కార్ను ఏకి పారేసింది. ఈ సంక్షోభ సమయంలో ట్విటర్లో తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడం, చర్చకు తెరలేపడం అనేది క్షమించరానిదని లాన్సెట్ ఎడిటోరియల్ అభిప్రాయపడింది. అంతేకాదు ఆగస్ట్ కల్లా ఇండియాలో కరోనా మరణాలు 10 లక్షలకు చేరుతాయని హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ (ఐఎహ్ఎంఈ) అంచనా వేసిందని, అదే జరిగితే దానికి పూర్తి బాధ్యత మోదీ ప్రభుత్వానిదే అని లాన్సెట్ స్పష్టం చేసింది.
జాతీయ విపత్తు మోదీ సర్కార్ చేజేతులా చేసుకున్నదని ఆ జర్నల్ తేల్చి చెప్పింది. కరోనా మొదటి వేవ్ను సమర్థంగా ఎదుర్కొన్న భారత్.. తర్వాత దానిని నాశనం చేసుకున్నదని విమర్శించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ కొవిడ్ టాస్క్ఫోర్స్ కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం ఏంటని ప్రశ్నించింది. సంక్షోభం ముదురుతున్న వేళ ఇండియా కచ్చితంగా తన ప్రణాళికను పునర్నిర్మించుకోవాలని సూచించింది. ప్రభుత్వం తన తప్పిదాలను అంగీకరించి, బాధ్యత గల నాయకత్వం, పారదర్శకతతోనే అది సాధ్యమవుతుందని లాన్సెట్ అభిప్రాయపడింది.
దీనికోసం కొవిడ్ వ్యాప్తిని సాధ్యమైనంత అరికట్టాలని, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. లాక్డౌన్ అంశాన్ని పరిశీలించడంతోపాటు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని, 15 రోజులకోసారి ప్రభుత్వంలో ఏం జరుగుతోందో వివరించాలని స్పష్టం చేసింది. కొత్త కరోనా వేరియంట్లను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ను పెంచాలనీ సూచించింది. స్థానిక ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి కట్టడి చర్యలను చేపడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ పని చేయడం లేదని అభిప్రాయపడింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం, జనాలు గుమిగూడే ఈవెంట్లను అడ్డుకోవడం, స్వచ్ఛంద క్వారంటైన్, టెస్టింగ్ల దిశగా కేంద్రం దృష్టి సారించాలని చెప్పింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే హాస్పిటల్స్పై భారం పెరిగిపోతున్నదని, ఆరోగ్య కార్యకర్తలు అలసిపోతున్నారని, వైరస్ బాధిలవుతున్నారని లాన్సెట్ చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత కూడా ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ మాత్రం కరోనాపై జయించినట్లు ప్రకటనలు చేశారని గుర్తు చేసింది. ఇన్ఫెక్షన్లు పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని తెలిసినా మతపరమైన సంబురాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విమర్శించింది.