ముంబై: దమ్ముంటే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని శివసేన చీఫ్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి సవాల్ విసిరారు. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గెలిచిన నేపపథ్యంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శివసేన క్యాడర్కు పిలుపునిచ్చారు. సోమవారం శివసేన భవన్కు వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. శాసనసభను ఏకపక్షంగా నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని విమర్శించారు. శివసేనను అంతం చేసేందుకు బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. దమ్ముంటే రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీకి సవాల్ చేశారు. ‘ఇలాంటి రాజకీయ ఆటలకు బదులు ప్రజా కోర్టుకు వెళ్దాం. ఎవరు తప్పు చేశారో అన్నది ప్రజలు సమాధానం చెబుతారు. మేం తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపుతారు. మీరు (బీజేపీ, షిండే వర్గం) తప్పు చేస్తే మిమ్మల్ని ఇంటికి పంపుతారు’ అని అన్నారు.
కాగా, బీజేపీ కుతంత్రాలను కోర్టులోనే తేల్చుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారా అనే దానిపై నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు. అలాగే పోరాడాలని అనుకునే వారే తనతో ఉండాలని శివసేన క్యాడర్కు ఉద్ధవ్ సూచించారు.