ముంబై : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన మహా వికాస్ అఘడి (ఎంవీఏ)లో విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ భాగస్వామ్య పక్షాలు ఎన్సీపీ, కాంగ్రెస్లతో తాను రాజకీయంగా విభేదిస్తానని పేర్కొన్నారు. ఆ పార్టీలకు రాజకీయంగా తాను వ్యతిరేకమే అయినా ప్రభుత్వంలో వారు చేసే మంచిపనులను తప్పులుగా ఎంచబోనని స్పష్టం చేశారు. తన తండ్రి బాలాసాహెబ్ లేదా తాను ఇలాంటి పనులు ఎన్నడూ చేయబోమని అన్నారు.
మహారాష్ట్రలో సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలు ముదిరాయనే వార్తల నేపథ్యంలో ఠాక్రే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా తన కదలికలపై సేన, ఎన్సీపీలు నిఘా పెడుతున్నాయని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఏంవీఏ సర్కార్లో కలకలం రేపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుందని ఆయన చేసిన ప్రకటన సంకీర్ణ సర్కార్లో లుకలుకలను బయటపెట్టింది.