ముంబై-హైదరాబాద్ హెచ్ఎస్సార్పై ప్రధానికి ఉద్ధవ్ లేఖ
ముంబై, సెప్టెంబర్ 28: ముంబై-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ (హెచ్ఎస్సార్) కారిడార్ అలైన్మెంట్ను జాల్నా-నాందేడ్ మార్గం మీదుగా వెళ్లేలా మార్చాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఠాక్రే లేఖ రాశారు. ముంబై-నాగ్పూర్ హెచ్ఎస్సార్ను ‘సమృద్ధి మహామార్గ్’ పరిధిలో చేపట్టేందుకు సహకరిస్తామని తెలిపారు. సమృద్ధి మహామార్గ్… ముంబై, నాగ్పూర్లను అనుసంధానం చేసే సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్వే. ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాందేడ్-జాల్నా మధ్య ఎక్స్ప్రెస్వేకు ప్రణాళిక రచిస్తున్నది. ముంబై-నాగ్పూర్ హెచ్ఎస్సార్ జాల్నా వరకు సమృద్ధి మహామార్గ్ పరిధిలో ఉంటుంది. కాబట్టి దానిని హైదరాబాద్ వరకు పొడిగించవచ్చు’ అని ఠాక్రే పేర్కొన్నారు. కాగా ముంబై-హైదరాబాద్ హెచ్ఎస్సార్ కారిడార్ పూర్తయితే ఇరు నగరాల మధ్య ప్రయాణకాలం ప్రస్తుతమున్న 14 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.