న్యూఢిల్లీ: కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మార్కెట్లు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కోటక్ మహేంద్ర బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ కేంద్ర ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే.. కొత్తగా నగదును ముద్రించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. ప్రభుత్వం తన బ్యాలెన్స్ షీట్ను విస్తృతపరుచుకోవాల్సిన సమయం ఇదే అని, ఆర్బీఐ సహాయంతో నగదును ప్రింట్ చేయాలని, ఆ సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ పని మనం చేయగలమని ఆయన అన్నారు. పేదలకు నేరుగా నగదును బదిలీ చేయాలని, జీడీపీలో ఒక శాతం అంటే, సుమారు రెండు లక్షల కోట్ల వరకు ట్రాన్స్ఫర్ జరిగేలా చూడాలన్నారు. పేదలకు వైద్య సదుపాయాలు అందేలా చూడాలన్నారు. కోవిడ్ ధాటికి చాలా వరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయని, వ్యాపార స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం వచ్చిందన్నారు.