జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ తల నరికిన హంతకులు వినియోగించిన బైక్ నంబర్ ప్లేట్ 2611 సంచలనం రేపుతున్నది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడి తేదీ (26/11)ని పోలిన ఈ నంబర్ కోసం నిందితుడు అదనంగా రూ.5,000 చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. సస్పెండైన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ, ప్రవక్తపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలను కన్హయ్య లాల్ సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీ మంగళవారం ఆర్జే 27 ఏఎస్ 2611 నంబర్ ఉన్న బైక్పై టైలర్ కన్హయ్య షాప్కు వెళ్లారు. పట్టపగలు ఆయన తల నరికి హత్య చేశారు. అనంతరం ఆ బైక్పై పారిపోతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే ఇద్దరు నిందితులకు పాకిస్థాన్లోని ఉగ్ర వాద సంస్థతో సంబంధాలున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు కేంద్రం అప్పగించింది.
కాగా, హంతకులు వినియోగించిన ఆర్జే 27 ఏఎస్ 2611 నంబర్ ఉన్న బైక్ ప్రస్తుతం ఉదయపూర్లోని ధన్ మండి పోలీస్ స్టేషన్లో ఉంది. ముంబైలో జరిగిన ఉగ్ర దాడి తేదీ (26/11)ని పోలినట్లుగా బైక్ నంబర్ ఉండటంతో పోలీసులు దీనిపై ఆరా తీశారు. బైక్ యజమాని రియాజ్ అక్తరీ 2013లో బ్యాంకు లోన్ తీసుకుని దీనిని కొనుగోలు చేశాడు. అయితే ఈ నంబర్ ప్లేట్ కోసం ఆర్టీఏ సిబ్బందికి అతడు రూ.5000 అదనంగా చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. 2014 మార్చిలో ఈ బైక్ ఇన్సురెన్స్ ముగిసింది.
మరోవైపు రియాజ్ పాస్పోర్ట్ ప్రకారం 2014 ఆరంభంలో అతడు నేపాల్కు వెళ్లాడని పోలీసులు తెలిపారు. అలాగే పాకిస్థాన్కు ఫోన్ కాల్స్ చేసినట్లుగా అతడి మొబైల్ ఫోన్ కాల్స్ డేటా ద్వారా తెలిసిందన్నారు. తాజాగా 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడి తేదీని పోలిన 2611 బైక్ నంబర్ కోసం అతడు అదనంగా డబ్బులు చెల్లించినట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులకు పాక్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లుగా స్పష్టమవుతున్నదని పోలీసులు వెల్లడించారు.