ముగ్గురు విద్యార్థులకు వందకు వంద పర్సంటైల్
అన్ని క్యాటగిరీల్లో ప్రతిభ చాటిన మన విద్యార్థులు
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలను జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. తెలంగాణకు చెందిన బన్నూరు రోహిత్ కుమార్ రెడ్డి, మడూరు ఆదర్శ్ రెడ్డి, జోస్యుల వెంకట ఆదిత్య వందకు వంద శాతం పర్సంటైల్ సాధించారు. దేశంలో ఈ విధంగా వందకు వంద పర్సంటైల్ సాధించిన వారు 13 మంది ఉండగా వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన విద్యార్థులు కావడం విశేషం. దేశంలో క్యాటగిరీల వారీగా టాప్లో నిలిచిన వారిలో తెలంగాణకు చెందిన విద్యార్థులు ప్రతి క్యాటగిరీలో స్థానం సంపాదించారు. జనరల్ క్యాటగిరీలో ముగ్గురు వందకు వంద శాతం పర్సంటైల్ సాధించారు. ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీలో ‘టాప్ 5’లో తెలంగాణకు చెందిన మన్నెం చరణ్, గంగిశెట్టి కృష్ణా సాయికుశల్ నిలిచారు. ఓబీసీ కోటాలో తెర్లి తులసీరాం స్థానం సాధించాడు. ఎస్టీ క్యాటగిరీలో ‘టాప్ 5’లో నలుగురు తెలంగాణ విద్యార్థులే. వారు ఇస్లావత్ నితిన్, నేనావత్ ప్రీతం, బిజ్లీ ప్రచోతన్ వర్మ, ముడే రిషి నాయక్. వికలాంగుల కోటాలో మల్లకుంట్ల భాను రంజన్రెడ్డి టాప్లో నిలిచారు. అమ్మాయిల క్యాటగిరీలో టాప్ 10లో దొంతిరెడ్డి హన్విత రెడ్డి, పల్లె భావన స్థానం సంపాదించారు.