స్వగ్రామంలో నూతన హంగులతో
గ్రామ పంచాయతీ నిర్మాణం
ఊరికి ఉపకారిగా తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి
పదేండ్లుగా సేవా కార్యక్రమాలు
బీబీపేట్, మే 29: స్వలాభమే కాంక్షగా జీవిస్తూ.. ఎక్కడికో వెళ్లి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న పలువురు సొంత ఊరిని మరుస్తున్నారు. ఆ ఊరితో నాకేమిటి..? అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కన్న ఊరిని, తాము ఉన్నత స్థానంలో నిలువడానికి సహకరించిన పాఠశాలను కూడా మర్చిపోతున్నారు. కానీ తనకు సొంత ఊరిపై ఉన్న మమకారంతో అభివృద్ధికి సహకరిస్తున్నాడు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి.
జనగామ గ్రామానికి చెందిన సుశీలమ్మ నారాయణరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా సుభాష్రెడ్డి చిన్నవాడు. కొన్నేండ్ల క్రితం ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడే ప్రముఖ బిల్డర్గా స్థిరపడ్డారు. ఆయన కు భార్య రజని, కుమారుడు నిహాంత్రెడ్డి ఉన్నారు. ఎంతో సంపాదించినా.. తన సొంత ఊరుకు, మండలానికి ఏదో చేయాలనే తపన ఆయనను సేవా కార్యక్రమాల వైపునకు మళ్లించింది. దీంతో బీబీపేట మండలంలో పది సంవత్సరాలుగా ఆయన వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు ఇప్పటికే సుమారు రూ.15లక్షల విలువ చేసే ఎల్ఈడీ బల్బులను సమకూర్చారు. పలు ఆలయాల అభివృద్ధి కోసం రూ.30 లక్షల వరకు గ్రామాల పెద్దలకు, ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. పేద కుటుంబాల పిల్లల పెండ్లిలకు పుస్తె, మెట్టెలను అందజేస్తుంటారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల కోసం తనవంతుగా రూ.ఐదు వేలు అందజేస్తాడు.
రూ.ఆరు కోట్లతో బీబీపేటలో పాఠశాల భవన నిర్మాణం..
సుభాష్రెడ్డి బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయన చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నది. దీంతో సొంత డబ్బులు రూ.ఆరు కోట్లతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. నూతన హంగులతో చేపడుతున్న ఈ భవనాన్ని జూన్ నెలాఖరు వరకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా కార్మికులు మూడు షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు భవనాన్ని సందర్శించారు.
నూతన హంగులతో జీపీ నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా స్వగ్రామం జనగామలో నూతన హంగులతో రెండు అంతస్తుల్లో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. గ్రామ పాలనలో భాగస్వాములు అయ్యే ప్రతి అధికారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రజలకు అధికారులందరూ ఒకే ప్రదేశంలో ఉండే వీలు ఏర్ప డింది. గ్రామంలో రూ.15 లక్షలతో గ్రంథాలయాన్ని నిర్మించారు. దీంతో విద్యార్థులు, యువత చదువుకోవడానికి అనుకూలంగా మారింది. గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఆయన సహకరిస్తున్నారు.