యాదాద్రి భువనగిరి, మార్చి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో నీటి సౌకర్యం పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో పడావుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. ఓవైపు మూసీనీళ్లు.. గత ఏడాది అందుబాటులోకి వచ్చిన గోదావరి నీళ్లు పంటల సాగుకు ఊతమిచ్చాయి. 24 గంటల కరెంట్.. గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు.. పెట్టుబడి సాయం కూడా తోడు కావడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో గత రెండేళ్లుగా పంటల సాగుకు ఉపక్రమిస్తూ వస్తున్నారు. పట్నాలకు వలస వెళ్లిన రైతులు గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత సాగు సైతం సక్సెస్ అయ్యింది. ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతు లు పంటలు సాగుచేశారు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడం.. బోరు, బావుల్లో సైతం భూగర్భజలాలు పెరగడంతో యాసంగి సీజన్లో రైతులు రెట్టించిన ఉత్సాహంతో వరి నాట్లు వేశారు. అక్కడక్కడా కోతలు కూడా జోరందుకున్నాయి. కరోనా మరోసారి విజృంభిస్తుండ డం.. పంటలను అమ్ముకునే విషయంలో రైతులు ఆందోళన చెందుతుండగా…పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని చెప్పి సీఎం కేసీఆర్ జిల్లా రైతాంగానికి కొండంత భరోసాను కల్పించారు.
4.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
గత యేడాది రెండు సీజన్లలో భారీ ఎత్తున ధాన్యం దిగుబడులు రావడంతో రైతులు ఇబ్బందులు పడకుండా జిల్లాలో 270 వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశారు. ప్రస్తుత యాసంగిలో కూడా అదే స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి యాసంగి పంటల సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రైతాంగం జిల్లా వ్యాప్తంగా 2.40లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. ఈ క్రమంలో 4.80లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముందస్తుగా సాగు చేసిన రైతులకు అక్కడక్కడా పంట చేతికి రావడం కూడా మొదలైంది. కరోనా పరిస్థితుల్లో పంటల అమ్మకాల సందర్భంగా రైతులు మార్కెట్లకు మూకుమ్మడిగా తరలివస్తే మహమ్మారి ముప్పు పొంచి ఉండడంతో..జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా సీఎం కేసీఆర్ అన్నిశాఖలను అప్రమత్తం చేశారు. తొందరపడి రైతులు తక్కు వ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ పంటల కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఆదరువు కల్పించేలా ముందు కు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోళ్ల కోసం 270 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. 99 కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో, 166 కేంద్రాలను పీఏసీఎస్ల ఆధ్వర్యంలో, మరో 5 కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలుపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయనుండడంతో ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పంటల అమ్మకాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో 44లక్షల గన్నీబ్యాగులు
రైతులు పండించిన ప్రతి గింజను కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండడంతో జిల్లాలో 4.70లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అధికార యంత్రా ంగం చర్యలు చేపడుతోంది. ముందుగా ఎక్కడైతే వరికోతలు మొదలయ్యే అవకాశం ఉన్నదో..అక్కడ కేంద్రాలను ముందుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత కోతల క్రమాన్ని బట్టి కేంద్రాలను ప్రారంభించనున్నారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసి ఉంచింది. 1.17కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉండగా.. ప్రస్తుతానికి 44లక్షల బ్యాగులను అందుబాటులో ఉంచారు. కొనుగోళ్ల సందర్భంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు హర్షణీయం
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్లు భిక్షపతి, బీసు ధనలక్ష్మి, గ్రామ కో ఆర్డినేటర్ నాతిరాజు, నాతిస్వామి పాల్గొన్నారు.
ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు
యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 270 కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నాం. ఏప్రిల్ మూడో వారంలో ప్రాధాన్య తాక్రమంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా ఎండపోసి.. తాలు, తేమ లేకుండా తీసుకురావా లి. తేమశాతం 17కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుని మద్దతు ధర పొందాలి.
-గోపీ కృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా
ఇవీ కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్