మంత్రి కొప్పుల ఈశ్వర్
అధికారులతో సమావేశం
ధర్మపురి, మార్చి 29: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సోమవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ఎంత మంది దరఖాస్తులు చేసుకున్నారని అడిగారు. వీరిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న, కొత్తగా మంజూరైన రుణాల వివరాలను తెలుసుకున్నారు. కొన్ని చోట్ల బ్యాంకర్లు ఇబ్బందులు పెడుతున్నారని తెలిసిందనీ, ఈ సమస్య పరిష్కారానికి కార్పొరేషన్ రుణాలు ఇచ్చేముందు లబ్ధిదారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని చెప్పారు. ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు మండలాల్లో కుట్టుమిషన్ శిక్షణ, జ్యూట్ బ్యాగుల తయారీ, సహజ ఉత్పత్తుల తయారీ, పాడిపశువుల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పందిరి కూరగాయల సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్, మైనార్టీ సంక్షేమాధికారి సుందర వరదరాజన్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ ఎంతో తెలుసా..?