లూథియానా: పంజాబ్లో గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ రాష్ట్రం లూథియానా జిల్లాలోని జాగ్రాన్ పట్టణంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు విధి నిర్వహణలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు.
దుండగుల కాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ భగవాన్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దల్వీందర్ సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఏఎస్ఐలు ఇద్దరూ రాష్ట్రానికి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.