లండన్, సెప్టెంబర్ 9: హైదరాబాద్కు చెందిన ఉపాధ్యాయురాలు ముసునూరి మేఘన ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక గ్లోబల్ టీచర్ అవార్డు రేసులో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల నుంచి 8 వేల నామినేషన్లు రాగా అందులో టాప్-50 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. జాబితాలో మేఘన, బీహార్లోని భాగల్పూర్కు చెందిన ఉపాధ్యాయుడు సత్యం మిశ్రా ఉన్నారు. ఫౌంటెయిన్హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వ్యవస్థాపకురాలైన మేఘన సాంఘిక శాస్త్రం, ఇంగ్లిష్, గణితం బోధిస్తున్నారు. యునెస్కో భాగస్వామ్యంతో వార్కే ఫౌండేషన్ ప్రతీ ఏట గ్లోబల్ టీచర్ అవార్డును ప్రకటిస్తుంది. ఈ ప్రైజ్ కింద రూ.7.35 కోట్ల (మిలియన్ డాలర్లు) నగదు బహుమతి అందజేస్తారు. గతేడాది గ్లోబల్ టీచర్ ప్రైజ్ను మహారాష్ట్రకు చెందిన రంజిత్సింగ్ దిశాలే గెల్చుకొన్నారు. దీంతో పాటు గ్లోబల్ స్టూడెంట్ ప్రైజ్కు కూడా టాప్-50 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయగా భారత్ నుంచి నలుగురు విద్యార్థులు కైఫ్ అలీ(జామియా మిలియా), ఆయుష్ గుప్తా(ఐఐఎం అహ్మదాబాద్), సీమా కుమారి(జార్ఖండ్), విపిన్ కుమార్ శర్మ(హర్యానా సెంట్రల్ వర్సిటీ) జాబితాలో చోటు సాధించారు. విజేతలను నవంబర్లో పారిస్లో జరిగే ఓ కార్యక్రమంలో ప్రకటిస్తారు.