అన్ని విధుల్లో సీసీ రోడ్లు..
పారిశుధ్య నిర్వహణలో ఫస్టు
వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు పూర్తి
ఎల్ఈడీ లైట్లతో గ్రామం జిగేల్..
నర్సింహులపేట, మే 3 : పల్లె ప్రగతితో గోపతండా గ్రామ రూపురేఖలు మారిపోయాయి. రెండేళ్ల క్రితం నూతనంగా ఏర్పాటైన గోపతండా జీపీ తొలి సర్పంచ్గా అజ్మీరా లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పాలకవర్గం, కార్యదర్శి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో హన్మతండా, లావుడ్యాతండాలు ఉన్నాయి. వీటిలో మొత్తం జనాభా 1000 కాగా, ఓటర్లు 700 మంది ఉన్నారు. గ్రామంలో హరితహారంలో భాగంగా 4000 మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారంలో మూడు రోజులు మొక్కలకు నీరు అందిస్తోంది. ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అలాగే, ఇంటింటా నాటిన పండ్ల మొక్కలు ప్రస్తుతం ఫలాలు ఇస్తున్నాయి. జామ, దానిమ్మ, బొప్పాయి పండ్లు ప్రజలకు అందుతున్నాయి.
పారిశుధ్యానికి ప్రాధాన్యం..
రాష్ట్ర ప్రభుత్వం అందించిన నిధులతో గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలు చేసి, రోజూ చెత్త సేకరించి, డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి గురువారం ప్లాస్టిక్ సేకరిస్తున్నారు. ప్రతి శుక్రవారం మురుగు నీటిని గుర్తించి, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నాటిన 400 మొక్కలు ప్రస్తుతం పచ్చగా దర్శమిస్తున్నాయి.
తీరిన కరంట్ కష్టాలు..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కరంట్ కష్టాలు దూరమయ్యాయి. కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేశారు. వీధిలైట్ల కోసం మూడో తీగను సైతం ఏర్పాటు చేశారు. శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతి స్తంభానికీ ఎల్ఈడీ లైట్ ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి సమయంలో గ్రామం ఎల్ఈడీ వెలుగులతో జిగేల్మంటోంది. కరంట్ కష్టాలు తీరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.