న్యూఢిల్లీ : నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్లను తయారు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి బీఫార్మసీ గ్రాడ్యుయేట్ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ రెమ్డిసివిర్ ఇంజక్షన్లను ఇప్పటివరకూ 2000కు పైగా వయల్స్ ను విక్రయించిందని పోలీసులు వెల్లడించారు. కరోనా వైరస్ చికిత్సలో వాడే రెమ్డిసివిర్ ఇంజక్షన్లకు భారీ డిమాండ్ నెలకొన్న క్రమంలో నిందితులు అడ్డదారులు తొక్కారు.
కీలక నిందితులు వతన్ కుమార్ సైనా, ఆదిత్య గౌతంలను ప్రశ్నించిన పోలీసులు పలు వివరాలను రాబట్టారు.నిందితులు ఒక్కో ఇంజెక్షన్ ను రూ 6000 నుంచి రూ 10,000కు ఏజెంట్లకు విక్రయిస్తుండగా వారు ఈ ఇంజెక్షన్లు అవసరమైన కస్టమర్లకు రూ 25,000 నుంచి రూ 40,000వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.