సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 27: ఎన్నికల సజావుగా జరిగేందుకు ఈ మూడు రోజులు మరింత కష్టపడి పని చేద్దామని అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, ఎన్నికల అబ్జర్వర్ డా.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పురపాలక సంఘ కార్యాలయంలో జోనల్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇందూర్ ఇంజినీరంగ్ కళాశాలలోని డీఆర్సీసీ సెంటర్లో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కోసం కొవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని 7+7 టేబుల్ సీటింగ్ను ఏర్పాటు చేశామని, అధికారులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
43 వార్డుల్లో దాదాపు 90శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసినట్లు, ఓటింగ్ శాతం పెరుగడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజు ఉదయాన్నే 7 గంటలకు చేరుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు, వృద్ధులకు, వికలాంగులకు వీల్చైర్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటిని రికార్డ్ చేయుటకు వెబ్ కాస్టింగ్ ఏర్పాట్ల కోసం విపంచి కళానియంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో సుడా వైస్ చైర్మన్ కేవీ రమణాచారి, అసిస్టెంట్ కమిషనర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 27: మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును ప్రజలు వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మకంగా, అతి సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా నజర్ వేశారు. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డులతో పాటు, గజ్వేల్ 12వ వార్డుకు ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. 131 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. 32 అతిసమస్యాత్మక కేంద్రాలపై పోలీసులు దృష్టి సారిస్తూ అణువణువు చిత్రీకరించేలా సీసీ కెమెరాలను సైతం బిగించారు.
అన్ని పోలింగ్ కేంద్రాలకు జియో ట్యాగింగ్ చేశారు. 99 సమస్యాత్మక కేంద్రాల్లోను గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిరంతరం వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఇప్పటి వరకు ముందస్తుగా 25 మందిని బైండోవర్ చేశారు. పెండింగ్లో 3 నాన్బెయిలబుల్ వారెంట్ను ఎగ్జిక్యూట్ చేశారు. లైసెన్స్ కలిగిన 2 ఆయుధాలు డిపాజిట్ చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన వారిపై 3 కేసులను నమోదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు, హుస్నాబాద్ డివిజన్ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సైదులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు అడిషనల్ డీసీపీలు ముగ్గురు, ఏసీపీలు నలుగురు, 14 మంది సీఐలు, 31 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు 415 మంది, మొబైల్ పార్టీలు 11, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నాలుగేసి చొప్పున టీమ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 465 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ 4, ఫ్లయింగ్ స్కాడ్ 4, స్టార్టిస్టికల్ సర్వెలైన్ టీమ్ 4, వీడియో నిఘా బృందాలు 2 ఏర్పాటు చేశారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణంతో పాటు గజ్వేల్ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ నెల 30న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 28 నుంచి మే 1 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద, చుట్టూ పక్కల 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేస్తారు.
ఓటర్లను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల నియమావళి ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలి. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే పోలీసు కమిషనరేట్ వాట్సాప్ 7901100100, సిద్దిపేట డివిజనల్ అడిషనల్ ఎస్పీ 9490617009, గజ్వేల్ ఏసీపీ 8333998684, కంట్రోల్ రూమ్ నంబరు 8333998699, లేదా డయల్ యువర్ 100కు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తాం. – సీపీ జోయల్ డెవిస్