హైదరాబాద్ : హైదరాబాద్- మహబూబ్నగర్- రంగారెడ్డి, వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. ‘హైదరాబాద్’ నుంచి 93 మంది, ‘వరంగల్’ నుంచి 71 మంది పోటీచేస్తున్నారు. అభ్యర్థులందరి పేర్లతో పాటు, నోటా కూడా కలిపి ఎన్నికల్లో జంబో బ్యాలెట్ను వినియోగిస్తున్నారు. న్యూస్ పేపర్ పరిమాణంలో ఈ బ్యాలెట్ పేపర్ ఉండనున్నది. ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థులందరికీ ఓటువేసే అవకాశం ఉండటంతో ఓటింగ్పై ముందుగానే అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. లేకపోతే ఓటు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఓటింగ్ విధానమిది
-బ్యాలెట్ పేపర్పై అభ్యర్థులందరి పేర్లు తెలుగు, ఆంగ్ల భాషల్లో ఉంటాయి. పేరుకు ఎదురుగా ఉండే బాక్సులో ఓటరు సదరు అభ్యర్థికి ఇచ్చే ప్రాధాన్యతా సంఖ్యను వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యత సంఖ్యను అంకెల్లో (1, 2, 3, 4) మాత్రమే రాయాలి.
-పోలింగ్ కేంద్రంలో అధికారి ఇచ్చే పర్పుల్ (ఊదా రంగు) కలర్ స్కెచ్ పెన్తో మాత్రమే అంకెలు వేయాలి.
-మొదటి ప్రాధాన్యత ఓటును కచ్చితంగా వేయాలి. తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య వరకు ప్రాధాన్యతాక్రమంలో సూచించవచ్చు.
-ప్రాధాన్యతను సూచించే క్రమంలో మధ్యలో ఒక అంకెను వేయకుండా.. తర్వాత సూచించే ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు 1, 2, 3, 4, 6, 7, 8 ఇలా వస్తే.. మధ్యలో ‘5’ మిస్ అయినందున 4 వరకే పరిగణనలోకి తీసుకుంటారు.
-ఒక అభ్యర్థికి ఒక్క ప్రాధాన్యత ఓటును మాత్రమే ఇవ్వాలి. ఒకరి కంటే ఎక్కువమందికి ’1’ అని ఇస్తే ఆ ఓటు చెల్లదు. ఒక అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యత అంకెలు ఇచ్చినా చెల్లదు.
-అభ్యర్థి ఎదురుగా ఉన్న బాక్సులో రైట్ మార్కుగానీ, ఇతర రాతలు, సంతకాలు, వేలుముద్ర కానీ వేస్తే చెల్లదు.