ఇందూరు, ఏప్రిల్ 6 : కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైరస్బారిన పడిన వారికి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉం డాలని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలకు కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవారం ఆయన ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ దవాఖానలో 172 మంది చికిత్స పొందుతుండగా, సుమారు వందమం ది ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. టీకా వేయించుకున్న వారిలో కొంతమంది వైరస్బారిన పడే అవకాశాలు ఉన్నప్పటికీ, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉం డడంతో ప్రమాదం లేదన్నారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న ప్రైవేట్ దవాఖానలకు రేటింగ్ ఇస్తామన్నారు. రేటింగ్ ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. యాజమాన్యా లు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వృద్ధులు, వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారికి తప్పకుండా టీకా వేయాలన్నారు. దవాఖానల్లో పనిచేసే సిబ్బంది రెండు డోసుల టీకా వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ బారినపడిన ఓ ప్రైవేట్ డాక్టర్ వైద్య సేవలందించడంపై కలెక్టర్ అభ్యంతరం తెలిపారు. ప్రతి దవాఖానలో కొవిడ్ నిబంధనలను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సిన్ వృథా చేయవద్దని, సమన్వయంతో వ్యవహరించాలని సూ చించారు. నిరంతరం పర్యవేక్షించాలని వైద్యారోగ్యశాఖాధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో సుదర్శనం, డాక్టర్ తుకారాం, డాక్టర్ రాజేశ్, ప్రైవేట్ దవాఖానల ప్రతినిధులు పాల్గొన్నారు.