న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ను తొలగించింది. ఆరు నెలలకుపైగా ఈ అకౌంట్ (@MVenkaiahNaidu) ఇన్యాక్టివ్గా ఉండటం వల్లే ట్విటర్ ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఉపరాష్ట్రపతి అధికారిక అకౌంట్ @VPSecretariatకు మాత్రం బ్లూటిక్ అలాగే ఉంది.
అయితే ఆయన వ్యక్తిగత అకౌంట్కు వెరిఫైడ్ స్టేటస్ తీసేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్విటర్ తిరిగి బ్లూటిక్ ఇవ్వనున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈ అకౌంట్ నుంచి వెంకయ్యనాయుడు చివరిసారి 2020, జులై 23న ట్వీట్ చేశారు. ట్విటర్ ఇచ్చే ఈ బ్లూటిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ వల్ల ఇది అధికారిక, గుర్తింపు పొందిన, యాక్టివ్గా ఉన్న అకౌంట్గా ధృవీకరించుకోవచ్చు. ప్రముఖ వ్యక్తులు, బ్రాండ్లకు మాత్రమే ట్విటర్ ఈ గుర్తింపు ఇస్తుంది.
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్కు బ్లూటిక్ రీస్టోర్ చేసింది ట్విటర్. దానిని తొలగించిన గంటల వ్యవధిలోనే ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ రీస్టోర్ చేయడం గమనార్హం. గతేడాది జులై నుంచి ఈ అకౌంట్ ఇన్యాక్టివ్గా ఉందంటూ శనివారం ఉదయం వెరిఫైడ్ అకౌంట్ను సూచించే బ్లూటిక్ను ట్విటర్ తొలగించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్విటర్ దిగి వచ్చింది. ఈ మధ్య తన అధికారిక ఖాతాను ఆయన ఎక్కువగా వినియోగిస్తుండటంతో వ్యక్తిగత ఖాతా ఇన్యాక్టివ్గా ఉన్నదని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
వెంకయ్యనాయుడు ట్విటర్ అకౌంట్కు బ్లూటిక్ తీసేయడాన్ని కొందరు ట్విటరర్లు ప్రశ్నించారు. ఎన్నో ఖాతాలు ఏడాదికిపైగా ఇన్యాక్టివ్గా ఉన్నా.. వాటికి బ్లూటిక్ కొనసాగడాన్ని గుర్తు చేశారు. అటు బీజేపీ నేత సురేశ్ నకువా కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అని ఆయన అనడం విశేషం.