న్యూఢిల్లీ: తీవ్ర నిరసన వెల్లువెత్తిన తర్వాత మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ దిగి వచ్చింది. వివాదాస్పదంగా పోస్ట్ చేసిన ఇండియా మ్యాప్ను సోమవారం రాత్రి తొలగించి వేసింది.
అంతకుముందు సోమవారం ఉదయం భారతదేశంలోని భూభాగాలను తప్పుగా చూపింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మకశ్మీర్, లడఖ్లను వేరే దేశంగా చూపి, భారత రాజకీయ చిత్ర పటాన్ని వక్రీకరించింది.
ట్విటర్ తన ‘ట్వీప్ లైఫ్’ సెక్షన్లో జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్ భూభాగాలుగా చూపకపోగా, వాటిని వేరే దేశంగా పేర్కొంది. ఈ సంగతిని గుర్తించిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. గతేడాది అక్టోబర్లో కూడా లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
ట్విట్టర్ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడటంతో ట్వీప్ లైఫ్లో పోస్టు చేసిన మ్యాప్ను పూర్తిగా తొలగించింది. ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్రానికి, ట్విట్టర్కు మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ మ్యాప్ పోస్టు చేయడం విమర్శలకు దారి తీసింది.
ట్విట్టర్ వ్యవహార శైలిపై మండిపడుతున్న నెటిజన్లు.. దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు. తమ వెబ్సైట్ నుంచి వివాదాస్పద మ్యాప్ తొలగింపు విషయమై ట్విట్టర్ స్పందించలేదు.