న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వంతో వివాదాన్ని ఎదుర్కొంటున్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్కు ఆదివారం గట్టి షాక్ తగిలింది. సంస్థ ఇటీవల నియమించిన ట్విట్టర్ ఇండియా ఇంటరిమ్ రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చాతూర్ వైదొలిగారు.
నియమితులైన కొన్ని వారాల్లోనే ఆయన రాజీనామా చేయడం ఆసక్తికర పరిణామం. ట్విట్టర్ ఇండియా తాత్కాలిక గ్రీవియెన్స్ అధికారి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ధర్మేంద్ర చాతూర్ ఒక పోస్ట్లో పేర్కొన్నారు.
ఆయన వైదొలగడంతో కేంద్ర ఐటీ నిబంధనలను అమలు చేసేందుకు గ్రీవియెన్స్ అధికారి లేకుండా ట్విట్టర్ పని చేయాల్సిన దుస్థితి నెలకొంది. అయితే న్యూ ఐటీ రూల్స్ ప్రకారం ఇండియన్ సబ్స్క్రైబర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవియెన్స్ అధికారి తప్పనిసరిగా ఉండాలి.
కేంద్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021 ప్రకారం ఈ సోషల్ మీడియా తన వెబ్సైట్లో ఆయన పేరును డిస్ప్లే చేయరాదు. తాత్కాలిక గ్రీవియెన్స్ అధికారి రాజీనామా విషయమై స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది.
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్కు, కేంద్రానికి మధ్య న్యూ ఐటీ రూల్స్ అమలు విషయమై వివాదం నెలకొన్న నేపథ్యంలో ట్విట్టర్ ఇండియా తాత్కాలిక గ్రీవియెన్స్ ఆఫీసర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
న్యూ ఐటీ రూల్స్కు కట్టుబడి ఉండే విషయంలో ట్విట్టర్ ఉద్దేశపూర్వకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నదని కేంద్రం ఆరోపిస్తున్నది. గత నెల 25వ తేదీ నుంచే న్యూ ఐటీ రూల్స్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.