న్యూఢిల్లీ, జూలై 11: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల అమలు దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్కు చెందిన వినయ్ ప్రకాశ్ను రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి (ఆర్జీవో)గా నియమించింది. ఈ మేరకు ఆదివారం సంస్థ వెబ్సైట్లో వివరాలు పొందుపరిచింది. ఈ మెయిల్ ఐడీ, బెంగళూరులోని కార్యాలయ చిరునామా పేర్కొంది. గ్రీవెన్స్ అధికారుల నియామకంలో జాప్యంపై ట్విట్టర్ తీరుపై ఢిల్లీ హైకోర్టు కూడా గతవారం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. అధికారుల నియామకానికి 8 వారాల గడువు కోరిన విషయం తెలిసిందే. గడువు ముందుగానే ఆర్జీవోను నియమించడం గమనార్హం.
94 ఫిర్యాదులు వచ్చాయి
కొత్త ఐటీ నిబంధనలను సమ్మతిస్తూ ట్విట్టర్ ‘భారత్ పారదర్శక నివేదిక: వినియోగదారుల ఫిర్యాదులు, క్రియాశీల పర్యవేక్షణ జూలై 2021’ పేరిట తొలి కాంప్లియెన్స్ నెలవారీ నివేదికను విడుదల చేసింది. దీంట్లో భాగంగా మే 26-జూన్ 25 మధ్య 94 ఫిర్యాదులు అందాయని తెలిపింది. 133 యూఆర్ఎల్స్పై చర్యలు తీసుకున్నట్టు వివరించింది. ట్విట్టర్ ఖాతాలు రద్దు చేయాలన్న 56 ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. పిల్లల పోర్నగ్రఫీకి సంబంధించి 18,385 ఖాతాలు, ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న మరో 4,179 ఖాతాలను రద్దు చేసినట్టు పేర్కొంది.