భర్త మరణించినా ఆత్మైస్థెర్యంతో ముందుకు
పతి చూపిన బాటలోనే కార్పెట్ల తయారీ
60 మందికి ఉపాధి
బెంగళూర్, ఢిల్లీ, నోయిడా, తదితర నగరాల్లో స్టాళ్లు
ఆదర్శంగా నిలుస్తున్న మహిళ
హుజూరాబాద్, ఏప్రిల్ 16: 45 లక్షల టర్నోవర్ఇంటి పెద్ద అకాల మరణం.. ఇద్దరు పిల్లల పోషణ భారం.. భవిష్యత్ అగమ్యగోచరం.. కష్టాల కడలి నుంచి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగింది శ్రీదేవి! తన భర్త బాటలోనే కార్పెట్ల తయారీకి ఉపక్రమించింది. రాత్రింబవళ్లు శ్రమించి ఏటా ఏకంగా 45 లక్షల టర్నోవర్ సాధించింది. తాను నడుస్తున్న దారిలోనే మరో 60 మందికి ఉపాధి చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నది.
ఇల్లంతకుంట మండలం లక్ష్మాజిపల్లికి చెందిన వేముల శ్రీనివాస్ నేత కార్మికుడు. 2003లో కార్పెట్లను తయారు చేస్తూ చుట్టు పక్కల గ్రామాల్లో విక్రయించేవాడు. గ్రామంలోనే 15 మరమగ్గాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని విస్తరించాడు. 2011లో డెంగీతో మరణించాడు. ఇంటి పెద్ద దిక్కు మరణంతో భార్య శ్రీదేవి, పదహారేండ్ల కొడుకు అజయ్కుమార్, పదమూడేండ్ల కూతురు ప్రవళ్లిక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీదేవి ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. భర్త స్ఫూర్తితోనే కార్పెట్లను తయారు చేయాలని సంకల్పించింది. గతంలో పని చేసిన 14 మంది కార్మికులను మళ్లీ పనిలో పెట్టుకున్నది. వారు నేసిన కార్పెట్లను విక్రయిస్తూ క్రమేణా ప్రావీణ్యం సాధించి స్వయంగా తయారు చేస్తున్నది.
60 మందికి ఉపాధి..
కార్పెట్ల్లు తయారు చేస్తున్న శ్రీదేవి తన కార్ఖానాలో 60 మందికి ఉపాధి కల్పిస్తున్నది. భర్త చనిపోయే సమయంలో 15 మగ్గాలు ఉండగా, వాటిని 48కు పెంచింది. ఇంటి దగ్గర 7, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం బంగ్లాపల్లిలో 4, సిరిసిల్లలో 4, ఎల్లారెడ్డిపేటలో 3, వేములపల్లిలో 3 మగ్గాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు వరంగల్ అర్బన్ జిల్లా మర్రిపెల్లిగూడెంలో 1, పంగిపల్లిలో 3, నర్సింగాపూర్లో 2, కమలాపూర్లో ఒక మగ్గంతో పాటు సొంత ఊరిలో వేరే చోట 21 మగ్గాలు ఏర్పాటు చేసింది. వీటికి సరిపడా రా మెటీరియల్ను సరఫరా చేస్తున్నది. అలాగే టేకుమట్లలో 12 మంది కార్మికులు ఏర్పాటు చేసుకున్న మరమగ్గాలకు మెటీరియల్ను అందిస్తున్నది. వారు తయారు చేసిన బట్టలు, కార్పెట్లను తానే విక్రయిస్తూ పరోక్షంగా మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది.
హాస్టళ్లకు సరఫరా..
శ్రీదేవి తయారు చేసిన కార్పెట్లను ప్రస్తుతం ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేస్తున్నది. గురుకులాలు, కస్తూర్బా, మోడల్, తదితర పాఠశాలల విద్యార్థుల కోసం ఆర్డర్లపై ప్రభుత్వానికి విక్రయిస్తున్నది. ఏటా సర్కారు నుంచి 10 లక్షల విలువైన కార్పెట్ల తయారీకి ఆర్డర్లు వస్తాయని చెబుతున్నది.
నెలకు 4 లక్షల వరకు సంపాదన..
శ్రీదేవి మొదటిసారిగా 2007లో మహిళా సంఘంలో 10 వేలు తీసుకొని కార్పెట్ల తయారీని ప్రారంభించింది. విడుతల వారీగా 30 వేలు, 50 వేలు అప్పు తీసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. ఏడాది క్రితం స్త్రీనిధి ద్వారా లక్ష రుణం తీసుకోగా ఇటీవల మంత్రి చేతుల మీదుగా 50 వేల బ్యాంకు రుణం తీసుకున్నది. వీటిని పెట్టుబడికి ఉపయోగిస్తూ నెలనెలా కిస్తీలు కడుతున్నది. కార్పెట్లు, తెల్లబట్ట తయారీ విక్రయాలతో నెలకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నది. ఏడాదికి సరాసరిగా 45 లక్షల టర్నోవర్ సాధిస్తున్నది. ఖర్చులు పోనూ 4 లక్షల దాకా మిగులుతాయని చెబుతున్నది.
వివిధ ప్రాంతాల్లో స్టాళ్లు..
డీఆర్డీఏ, నాబార్డు, చేనేత సంఘం ఆధ్వర్యంలో దేశంలో పలు నగరాల్లో ఏర్పాటు చేసే వస్త్ర ప్రదర్శనలో ఆమె స్టాళ్లను ఏర్పాటు చేస్తుంది. నెల క్రితం నోయిడాలో స్టాల్ ఏర్పాటు చేయగా 3 లక్షల విలువైన కార్పెట్లు, చున్నీలు విక్రయించినట్లు ఆమె పేర్కొన్నది. నాలుగేళ్ల క్రితం ముంబైలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో 6 లక్షల విలువైన సరుకును విక్రయించింది. అలాగే, ఢిల్లీ కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, కశ్మీర్, హైదరాబాద్, హిమాచల్ప్రదేశ్, కేరళ తదితర ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసింది. మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండడం వల్లే ఈ అవకాశం వచ్చిందని సగర్వంగా చెబుతున్నది.
తీరొక్క రకాలు..
శ్రీదేవి తీరొక్క రంగులు, విభన్నమైన డిజైన్లతో మన్నికైన కార్పెట్లను తయారు చేస్తున్నది. డోరు మ్యాట్, టీపాయ్, బెడ్న్న్రర్, డిన్నర్ మ్యాట్, తదితర రకాలతోపాటు హాల్లో పరుచుకునే కార్పెట్లను ఉత్పత్తి చేస్తున్నది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. వీటి ధర 100 నుంచి 3,500 వరకు పలుకుతున్నది. ముంబై నుంచి 20 లక్షల తెల్ల బట్ట (కోర) ఆర్డర్ శ్రీదేవికి వస్తున్నది.
ఇవి కూడా చదవండి
శ్రీశైలంలో హైఅలర్ట్ ప్రకటించాం : ఈఓ
ఎస్సారెస్పీ కెనాల్లో దూకి మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్య