సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు నేపథ్యంలో నెక్లెస్ రోడ్ (పీవీ మార్గ్)లో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ రోటరీ ఎదురుగా హుస్సేన్సాగర్ను ఆనుకొని గార్డెన్ ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మాణ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేట్టారు. ఈ నెల 28న పీవీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తూ వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ఆయన విగ్రహాన్ని నెక్లెస్ రోడ్డులో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండీఏ విగ్రహ ఏర్పాటు పునాదిని (ఫౌండేషన్) 20 అడుగుల ఎత్తులో నిర్మిస్తుండగా, దానిపై పీవీ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. విగ్రహం సుమారు అర ఎకరం స్థలంలో పలు నిర్మాణాలు చేపట్టారు.
నెక్లెస్ రోడ్డును తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పీవీ నరసింహారావు మార్గంగా ప్రకటించి బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. ఇందిరాగాంధీ రోటరీ నుంచి సంజీవయ్య పార్కు దగ్గర ఉన్న పీవీ ఘాట్ మీదుగా బుద్ధ భవన్కు ఉన్న 6 కి.మీ రహదారిని ఇప్పటీకే రూ.26.77 కోట్లతో వీడీసీసీ రోడ్డును నిర్మించారు. మరో రూ.4.22 కోట్లతో ఫుట్పాత్లను అభివృద్ధి చేస్తున్నారు.