కేసముద్రం, మార్చి16 : పరిమితికి మించి ప్ర యాణికులతో వెళ్తున్న టాటాఏస్ వాహనం బోల్తాపడి మహిళ మృతి చెందగా, మరో 25 మం దికి గాయాలైన సంఘటన మంగళవారం ఇనుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇనుగుర్తి గ్రామానికి చెందిన సుమారు 30 మంది కూలీలు అదే గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చితోట ఏరడానికి టాటాఏస్ వాహనం లో ఉదయం వెళ్లి, తిరిగి సాయంత్రం అదే వాహనంలో ఇంటికి బయల్దేరారు. పరిమితికి మించి ప్రయాణికులు ఉండడంతో వాహనం అదుపు తప్పి వరి పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహిళా కూలి లక్ష్మీనర్సమ్మ(60) అక్కడికక్కడే మృతి చెందింది. మరో 25 మందికి గాయాలయ్యాయి.స్వల్పంగా గాయపడిన 14 మందిని ఇనుగుర్తి పీహెచ్సీకి, తీవ్ర గాయాలైన మరో 11 మందిని 108లో మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వారిలో వసంత, యా దమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్ తెలిపారు. కాగా, మృతి చెందిన లక్ష్మీనర్సమ్మ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
ఆటో బోల్తాపడి ఆరుగురు విద్యార్థులకు గాయాలైన సంఘటన చిల్పూర్ మండలం క్రిష్ణాజీగూడెంలో మంగళవా రం జరిగింది. విద్యార్థుల కథనం ప్రకారం.. క్రిష్ణాజీగూడెం నుంచి కొంతమంది విద్యార్థులు స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండలోని మోడల్ స్కూల్, సెయింట్ థామస్ స్కూల్కు ఎం కుమార్ అనే వ్యక్తి ఆటోలో రోజూ వెళ్తుంటారు. మంగళవారం కుమార్ తన ఆటోను అదే గ్రామానికి చెం దిన సందీప్ అనే వ్యక్తికి అప్పజెప్పాడు. ఎనిమిది మంది విద్యార్థులతోపాటు నలుగురు గ్రామస్తుల తో కలిపి మొత్తం 12మందిని ఆటోలో ఎక్కించుకుని డ్రైవర్ బయలుదేరాడు. ఈ క్రమంలో గ్రా మం చివరన ఉన్న చర్చి సమీపంలో ఎదురుగా వస్తున్న బస్సుకు సైడ్ ఇచ్చే క్రమంలో ఆటో బోల్తాపడింది. గమనించిన స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో డిగ్రీ చదువుతున్న దొంతి అరుణ్, మోడల్ స్కూల్, సెయింట్ థామస్ విద్యార్థినులు సాదం కావేరి, సాదం వర్షి ణి, సంఘి దివ్య, దాసరి వర్షిణి, సాదం నీరజకు గాయాలయ్యాయి. వీరిని స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి పరీక్షించారు. మెరుగైన వైద్యం కోసం వారిని 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ స్టేషన్ఘన్పూర్ దవాఖానకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. కాగా, పాఠశాల సమయానికి తమ గ్రామం నుంచి స్టేషన్ఘన్పూర్, నమిలిగొండ వరకు బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.