భోపాల్, మే 1: దేశమంతా వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నది. టీకాలు లేక చాలా రాష్ర్టాలు వ్యాక్సినేషన్ కేంద్రాలను మూసివేస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 2.40 లక్షల కొవాగ్జిన్ డోసులు ఉన్న ఓ ట్రక్కును డ్రైవర్ రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయాడు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో కరేలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ట్రక్కు 12 గంటలుగా ఒకే చోట ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు, అధికారులకు సమాచారం అందించారు. ట్రక్కు హైదరాబాద్ నుంచి హర్యానాకు వ్యాక్సిన్లను తీసుకువెళ్తున్నదని అధికారులు తెలిపారు. డ్రైవర్ వికాస్ మిశ్రా ఆచూకీ తెలియడం లేదు. అతని ఫోన్ ట్రక్కుకు 16 కిలోమీటర్ల దూరంలో దొరికింది. ట్రక్కు ఇంజన్ ఆన్ చేసే ఉంది. కంటైనర్ లోపల ఫ్రిజ్ కూడా పనిచేస్తుంది. దీంతో వ్యాక్సిన్లకు ఎలాంటి నష్టం జరిగి ఉండదని భావిస్తున్నారు. కంటైనర్లో ఉన్న వ్యాక్సిన్ల ధర రూ.8 కోట్లు. మరో డ్రైవర్ను ఏర్పాటు చేసి ట్రక్కును హర్యానాకు పంపించారు.