నాగపూర్ : కరోనా వైరస్ జనజీవితాలను అతలాకుతలం చేస్తున్న విపత్తు వేళ మానవత్వం చాటుతూ ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహారం అందిస్తూ ఔదార్యం చాటుకుంటున్నాడు. టూవీలర్ కు కంటెయినర్ ను అమర్చి దానిపై ఆహారాన్ని అందిస్తూ నాగపూర్ వీధుల్లో ఆయన ప్రతిరోజూ కనిపిస్తుంటాడు. గత కొన్నేండ్లుగా అన్నార్తలు ఆకలి తీర్చుతున్న జంషెడ్ సింగ్ కపూర్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలోనూ తన సేవలను కొనసాగిస్తున్నారు.
ఆస్ట్రాలజర్ అయిన కపూర్ రోజూ మద్యాహ్నం మూడు గంటల నుంచి దాదాపు ఐదు గంటల పాటు ప్రజలకు దాల్ కిచిడి పంచుతారు. 2013 నుంచి తాను ఈ సేవను అందిస్తున్నానని, తొలుత పేదలే తన వద్ద ఆహారం స్వీకరించేవారని, కరోనా మహమ్మారి వ్యాప్తితో అందరూ తన ఆహారం తీసుకుంటున్నారని కపూర్ చెప్పుకొచ్చారు. తనకు ఈ సేవను కొనసాగించేందుకు పలువురు విరాళాలు అందిస్తున్నారని అన్నారు. గురునానక్ దేవ్ స్ఫూర్తితో తాను పేదలకు సేవ చేస్తున్నానని అన్నారు.