మందమర్రి, ఏప్రిల్ 2 : కొవిడ్-19 వ్యాక్సిన్పై రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు, యువకులు, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ప్రజలు, సన్నిహితులకు అవగాహన కల్పించాలని మందమర్రి మండల వైద్యాధికారి శైలజ కోరారు. శుక్రవారం దవాఖానకు వచ్చిన ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో గల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 45 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నామని, టీకా తీసుకోవాలని కోరారు. ఎలాంటి జబ్బులున్నా వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు. అయినా కూడా మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకోవడం లాంటివి చేయాలని తెలిపారు. అవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు. 45 ఏండ్లు పైబడిన వారికి పూర్తయితే, వచ్చే నెల 18 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. నేరుగా దవాఖానకు వస్తే రిజిస్ట్రేషన్ చేసి, వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు. ఇప్పటి వరకు 45 ఏండ్లు పైబడిన 60 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి కే గంగాధర్, సూపర్ వైజర్లు కే శ్రీనివాస్, మల్లిక, ఏఎన్ఎంలు పద్మావతి, అనిత, ధనలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
‘టీకా వేయించుకోవాలి’
వేమనపల్లి, ఏప్రిల్ 2 : మండలంలో 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్-19 టీకా వేయించుకోవాలని వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. ఆధార్, ఓటర్ ఐడీ కార్డులతో రావాలని సూచించారు. అలాగే ముందుగా కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.