అమ్రాబాద్, జూన్ 15: మండలంలోని అభివృద్ధి కార్యాలయంలో మంగళవారం తొమ్మిదో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీభూముల సమస్యలపై చర్చించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కోర్ ఏరియాల్లో రైతులు సాగుచేస్తున్న భూములు వదిలేయాలని అటవీ శాఖ అధికారులు నోటీసులిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని సభ్యులు సభదృష్టికి తెచ్చారు. అనంతరం అటవీ క్షేత్ర అధికారి అర్చన మాట్లాడుతూ అటవీశాఖ పరిధిలో ఉన్న భూములు గతంలో అక్రమించుకొని ఎటువంటి ఆధారాలు లేని వారికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. అటవీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అడవుల వల్లే మానవ మనుగడ ఉందని ఆమె తెలిపారు. అనాదిగా సాగుచేస్తున్న భూములపై పునరాలోచించాలని సభకు విన్నవించి తీర్మానం చేసి పంపుతామన్నారు. అదేవిధంగా అన్ని శాఖల వారీగా అభివృద్ధి, చేయాల్సిన పనులను సమీక్షించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ ప్రణీత, ఎంపీవో వెంకటయ్య, సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు.