న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: బ్యాంక్ ఖాతాదారులను బోల్తా కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు ఐటీ రిఫండ్ను ఎరగా వాడుకుంటున్నారు. ఇప్పటికే 27 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కస్టమర్లు ఈ మోసగాళ్ల బారినపడ్డారు. ఈ మేరకు దేశీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ-ఇన్) తాజాగా వెల్లడించింది. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ యాప్గా భ్రమింపజేస్తూ ఐటీ రిఫండ్ను అందజేస్తామంటూ వచ్చే ఈ డిర్నిక్ ఆండ్రాయిడ్ ఆధారిత మాల్వేర్ ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరించింది. ఐటీ శాఖ వెబ్సైట్ను పోలి ఉండే ఓ ఫిషింగ్ వెబ్సైట్ ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో లింక్ పంపుతున్నారని, దీన్ని క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలను అడుగుతున్నదని, దీంతో సమాచారంతోపాటు నగదూ పోతున్నదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఈఆర్టీ-ఇన్ తెలియజేసింది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనవసరపు ఐటీ రిఫండ్ల లింక్ల జోలికి వెళ్లవద్దని సూచించింది.