అగర్తలా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) సభ్యులపై త్రిపుర పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 23 మంది సభ్యులకు మంగళవారం అర్థరాత్రి వేళ వ్యక్తిగత నోటీసులు జారీ చేశారు. విపత్తు నిర్వహణ చట్టం చట్టం 51బి కింద వారిపై నమోదైన కేసుకు సంబంధించి ప్రశ్నించేందుకు ఆగస్ట్ 1న పోలీస్ స్టేషన్కు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.
త్రిపురలో రాజకీయ పరిస్థితులు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి రాష్ట్ర ప్రజల్లో ఎంత మద్దతు ఉన్నది అన్నది అంచనా వేసేందుకు 23 మందితో కూడిన ఐప్యాక్ బృందం గతవారం అగర్తలాలోని ఓ హోటల్లో దిగింది. అయితే, కొవిడ్-19 ఆంక్షల సమయంలో బయట తిరుగుతున్నారన్న కారణంతో త్రిపుర పోలీసులు వారిని హోటల్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఐప్యాక్ సభ్యులను ఈ నెల 25 నుంచి హోటల్లోనే పోలీసులు ఉంచారు. హోటల్ దాటి బయటకు వెళ్లవద్దని వారిని హెచ్చరించారు.
మరోవైపు ఐ-ప్యాక్ టీమ్ను హోటల్లో అక్రమంగా బంధించారని ఆరోపిస్తూ త్రిపురలోని తృణమూల్ పార్టీ నేతలు పోలీసుల చర్యలపై మండిపడ్డారు. త్రిపురలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర, ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు టీఎంసీ బృందం బుధవారం త్రిపుర చేరుకోనున్నట్లు సమాచారం.