తైపీ: పొరుగు దేశం చైనా ఒక కయ్యాలమారిలా తయారయ్యింది. నిత్యం ఏదో ఒక దేశంతో కయ్యం పెట్టుకోకపోతే పొద్దేపోదు అన్నట్లుగా చైనా వ్యవహారశైలి ఉన్నది. ఏడాది కాలంగా సరిహద్దుల్లో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం.. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్తోనూ గొడవ పెట్టుకొంది. ఈ నెల మొదట్లో ఇండోనేషియా గగనతలంలోకి చొరబడింది. గత వారం ఇండోనేషియా జలాల్లోకి చైనా సర్వే నౌక వెళ్లింది. ఇప్పుడు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి చైనా విమానాల దండు ప్రవేశించింది.
ఏకంగా తైవాన్పై యుద్ధానికే బయల్దేరినట్లు పాతికకు పైగా విమానాలు తైవాన్ జోన్లోకి చొరబడ్డాయి. వాటిలో అణ్వాయుధాలను ప్రయోగించే నాలుగు హెచ్-6 బాంబర్లు, 14 జె-16, ఆరు జె-11 ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కు వినియోగించే ఎర్లీ వార్నింగ్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఈ విమానాల దండు తైవాన్ ఆధీనంలోని ప్రథాస్ ద్వీపాల సమీపంలో విహరించింది. ఇటీవల చైనా విమానాలు తరచూ తైవాన్, ప్రథాస్ ద్వీపాల సమీపానికి వెళ్తున్నాయి. జనవరి 24న 15 విమానాలు, ఏప్రిల్ 12న మరో 25 విమానాలు తైవాన్ ఎయిర్ జోన్లోకి వెళ్లాయి.