సైనికుల పరాక్రమం చిరస్మరణీయం: సైన్యం
న్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబు నేతృత్వంలో నాడు భారత సైనికులు చూపిన తెగువను యావత్ దేశం స్మరించుకున్నది. ఆ ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్బాబుతోపాటు 20 మంది జవాన్లకు దేశం ఘనంగా నివాళులర్పించింది. సైనికుల పరాక్రమం దేశ ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెక్కుచెదరకుండా నిలిచిపోతుందని ఆర్మీ ట్వీట్ చేసింది. సంతోష్బాబు ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమను కొనియాడింది. సైన్యాధిపతి ఎంఎం నరవణేతోపాటు ఇతర సైనికాధికారులు వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సైనికులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టారని సైన్యం కొనియాడింది.