సూర్యాపేటసిటీ, ఏప్రిల్1 : నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా నిరంతరం నిఘా కొనసాగుతోందని ఎస్పీ ఆర్.భాస్కరన్ అన్నారు. జిల్లాలో తీవ్ర నేరాల దర్యాప్తు పురోగతిపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిశీలించి, తీవ్రమైన నేరాల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. దర్యాప్తు సమయంలో సాంకేతిక అంశాలను జోడించాలని సూచించారు. కోర్టు అధికారులతో సమన్వయం చేసుకొని కేసులు పరిష్కరించాలన్నారు. ప్రజా ఫిర్యాదులపై త్వరగా స్పందించాలని, బ్లూ కోట్స్, పెట్రోకార్, బీట్ సిబ్బంది సమర్ధవంతంగా పని చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ కార్యక్రమాలతో ప్రజలకు మరింతగా చేరువ కావాలని ఆదేశించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు, అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, చట్టపరంగా కేసు నమోదు చేయాలని సూచించారు. నేరాల అదుపునకు జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ, నాకాబందీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేసుల స్థితిగతులను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ మోహన్కుమార్, సీఐలు రవి, శ్రీనివాస్, విఠల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాఘవరావు, శివరాంరెడ్డి, ఎస్బీ సీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు రాజేశ్, నర్సింహ, ఎస్ఐలు భిక్షపతి, రామారావు, ఆర్ఎస్ఐ సంతోష్, డీసీఆర్బీ సిబ్బంది వెంకటయ్య, అంజన్రెడ్డి, ఐటీసెల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
ఓట్ల కోసం వరి నాటు వేస్తూ మంత్రి వినూత్న ప్రచారం..!
వాట్సాప్ వర్సిటీ సమాచారం నమ్మకండి : కొవిడ్ వ్యాక్సిన్లపై ఆరోగ్య మంత్రి భరోసా!