ఈ పాస్ ఉంటేనే సరిహద్దు చెక్పోస్టుల్లో అనుమతి
అలంపూర్, జూన్ 6 : రాష్ట్ర సరిహద్దులోని రాజోలి, కేటీదొడ్డి, బల్గేర, సింధనూరు, పులికల్, అలంపూరు చెక్పోస్టుల వద్ద కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పాస్ ఉంటేనే పోలీసులు వాహనాలను అనుమతిస్తున్నారు. 44వ జాతీయ రహదారిపై కర్నూలువైపు నుంచి రాష్ట్రంలోకి వచ్చే వాహనాలను పుల్లూరు టోల్ప్లాజా దగ్గర క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే వదులుతున్నారు. సరుకులు రవాణా చేసే గూడ్స్ వాహనాలు, అంబులెన్స్లు, అత్యవసర వాహన సర్వీసులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రూట్లో పంపుతున్నారు.
వాహనాలు ఫుల్చెక్..పాదచారులవైపు నోలుక్
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారిని అరికట్టి కొవిడ్ వ్యాప్తిని నిరోధించాలని రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తూ పాదచారులపై దృష్టి సారించడంలేదు. పుల్లూరు టోల్ప్లాజా దగ్గర పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. కర్నూలు నుంచి హైదరాబాద్వైపు వచ్చేవారు టోల్ప్లాజా వరకు ఒక వాహనంలో చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలపైనే పోలీసులు దృష్టి పెడుతూ పాదచారుల రాకపోకలను నిరోధించలేకపోతున్నారు. కొంతమంది అడ్డదారుల మీదుగా వెళ్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెక్పోస్టుల దగ్గర వాహనాల తనిఖీతోపాటు, పాదచారుల రాకపోకలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.