ఆదిలాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కంగ్టి: మహారాష్ట్రలో కరోనా ఉధృతి నేపథ్యంలో సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రోజూ వివిధ పనుల కోసం మహారాష్ట్రవాసులతోపాటు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైతం ఇరువైపులా రాకపోకలు సాగిస్తుంటారు. సరిహద్దులోని యావత్మల్, నాందేడ్, చంద్రాపూర్, కిన్వట్ జిల్లాల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చినవారితో వైరస్ వ్యాప్తిచెందకుండా అధికారులు సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసి రెవెన్యూ, వైద్యశాఖ, పోలీసుసిబ్బంది షిఫ్టులవారీగా విధులు నిర్వహిస్తున్నారు. జైనథ్ మండలం డొల్లార, బేల మండలం శంకర్గూడ, బోథ్ మండలం ఘన్పూర్ వద్ద తనిఖీకేంద్రాల్లో పొరుగు రాష్ట్రం నుంచి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే వెనుకకు పంపిస్తున్నటు జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం కర్ణాటక రాష్ర్టానికి సరిహద్దుగా ఉండటంతో మండలంలోని దెగుల్వాడి, సిద్దంగిర్గ, చందర్తండా, నాగూర్ (కె) గ్రామాల గుండా అక్కడి ప్రజలు ఇక్కడికి రానివ్వకుండా రహదారులను మూసివేయాలని కలెక్టర్ హనుమంత్రావు అధికారులకు శుక్రవారం ఆదేశించారు.