పనాజీ: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను వర్షాల కారణంగా శుక్రవారం దారి మళ్లించారు. మడగాన్-లోండా-మిరాజ్ మార్గంలో ప్రయాణించిన ఈ రైలు గోవాలోని దూద్సాగర్-సొనౌలిమ్ సెక్షన్లో ట్రాక్పై పడిన కొండచరియలను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్, వెనుక ఉన్న జనరల్ బోగి పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
మరోవైపు పట్టాలు తప్పిన జనరల్ బోగిని విడదీసి అందులోని ప్రయాణికులను ఇతర కోచ్లలో ఎక్కించారు. అనంతరం రైలును వెనక్కి మళ్లించి కులేం రైల్వే స్టేషన్కు చేర్చారు. ఈ ఘటనతోపాటు రైలు పట్టాలపై కొండచరియలు పడిన నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లను పాక్షికంగా, మరి కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.