న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ రాజధానిలో విధించిన సంపూర్ణ లాక్డౌన్ ను ఎత్తివేయాలని నేషనల్ ఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎన్డీటీఏ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కోరుతూ లేఖ రాసింది. కఠిన నియంత్రణలు అమలు చేస్తూ దశల వారీగా ఢిల్లీలో మార్కెట్లను తెరవాలని వారు విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కు ఎవరూ అనుకూలంగా లేకపోయినా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అయితే ప్రస్తుతం లాక్డౌన్ పొడిగించకుండా కఠిన నియంత్రణలతో దశల వారీగా మార్కెట్లను ఓపెన్ చేయాలని తాము కోరుతున్నామని ఎన్డీటీఏ ప్రెసిడెంట్ అతుల్ భార్గవ కోరారు.
ప్రభుత్వానికి అన్ని సమయాల్లో సహకరించే వ్యాపారులు ప్రస్తుతం ప్రభుత్వ సాయం కోసం వేచిచూస్తున్నారని భార్గవ పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో కుదేలైన వ్యాపారులకు ఇంతవరకూ ఎలాంటి సాయం ప్రకటించలేదని అన్నారు. ప్రభుత్వ సాయం లేకుండానే తాము ఈఎంఐలు, అద్దెలు, జీతాలు, ఆస్తి పన్ను, సకాలంలో జీఎస్టీ చెల్లించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. పలువురు వ్యాపారులు మనుగడ సాగించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.