పోలింగ్స్థానాలు 140
అభ్యర్థులు 957
ఓటర్లు 2.74 కోట్లు
140 స్థానాలకు నేడే పోలింగ్
40 ఏండ్లుగా ఐదేండ్లకోసారి అధికారం మార్పు
సంప్రదాయానికి తెరదించుతాం: ఎల్డీఎఫ్
సర్వేల్లోనూ అవే అంచనాలు
తిరువనంతపురం, ఏప్రిల్ 5: నాస్తికులైన కమ్యూనిస్టులకు దక్షిణాన కంచుకోటగా ఉన్న కేరళకు దేవభూమి (గాడ్స్ ఓన్ కంట్రీ) అనే పేరు ఉండటం విచిత్రం. ఇప్పుడీ దేవభూమిలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం రాష్ట్రంలోని 140 నియోజకవర్గాలకు ఒకే దఫాలో పోలింగ్ జరుగనున్నది. ఈ రాష్ట్రంలో వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) మధ్య గత నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఐదేండ్లకోసారి అధికారం మారుతూ వస్తున్నది. అయితే ఈసారి మాత్రం సీఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారు ఈ సంప్రదాయాన్ని భిన్నంగా వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తుందని ఎన్నికల సర్వేలన్నీ అంచనావేశాయి. యూడీఎఫ్ మాత్రం అధికారం తమదేనంటూ ధీమాగా ఉన్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కేరళలో మకాం వేసి ప్రచారం నిర్వహించారు.
మహిళా ఓటర్లే అధికం
మంగళవారం జరిగే పోలింగ్లో 957 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 2.74 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం ఓటర్లలో 1,32,83,724 మంది పురుషులు, 1,41,62,025 మంది మహిళలు, 290 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. పురుషులకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారిని ఆకర్షించేందుకు అన్నిపార్టీలు వరాలు కురిపించాయి.
బీజేపీ గంపెడాశలు
దక్షిణాది రాష్ర్టాల్లో పట్టుపెంచుకొనేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తున్న బీజేపీ.. కేరళ ఎన్నికలపై భారీ ఆశలే పెట్టుకున్నది. గత రెండేండ్లుగా తీవ్ర చర్చనీయాంశమైన శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదం తమకు కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు దశాబ్దాలపాటు యూడీఎఫ్తో కొనసాగిన బంధాన్ని తెగదెంపులు చేసుకొని కేరళ కాంగ్రెస్(ఎం) నేత జోస్ కే మణి ఎల్డీఎఫ్కు మద్దతు ప్రకటించటంతో రాజకీయ సమీకరణాలు మారవచ్చని పరిశీలకులు అంచనావేస్తున్నారు. ఈ పరిణామం యూడీఎఫ్ గెలుపు అవకాశాలను దెబ్బతీయవచ్చని పేర్కొంటున్నారు.
‘ఉచిత’ హామీలు
ఎన్నికల్లో ‘ఉచిత’ హామీలనగానే గుర్తుకొచ్చేది తమిళనాడు. ఈసారి కేరళలో కూడా అన్ని పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ఉచిత వరాలనే నమ్ముకొన్నాయి. గృహిణిలకు నెలనెలా పెన్షన్ పేరిట కొంతమొత్తం, పేదలకు సంక్షేమ పెన్షన్ల పెంపు, ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ఉచిత ల్యాప్టాప్లు.. ఇలా అన్ని పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో ఉచిత హామీలు గుప్పించాయి. బీజేపీ తన సహజసిద్ధమైన ఆయుధం మతాన్నే ఎక్కువగా నమ్ముకొన్నది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో లవ్జిహాద్ను అరికట్టేందుకు చట్టం తెస్తామని, శబరిమల ఆలయానికి కూడా ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. మెట్రోమ్యాన్ శ్రీధరన్ను చూసైనా ఓట్లు పడుతాయని ఆశలు పెట్టుకొన్నది.
మరిన్ని వార్తలు చదవండి..
ఒంటికాలితో బెంగాల్ను.. రెండుకాళ్లతో ఢిల్లీని గెలుస్తా
మధ్యవర్తికి రూ.10 కోట్ల కమిషన్
శత్రు క్షిపణులను దారి మళ్లించే చాఫ్
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట