సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎగువ మానేరు నింపాలని కేసీఆర్ ఎన్నో పాద యాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారు. గతంలో అనేకమంది సీఎంలు, మంత్రులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి ఉన్న కేసీఆర్ వల్లనే గోదావరి జలాలు ఎదురెక్కి మండుటెండల్లో ఎగువ మానేరు మత్తడి నుంచి దుంకుతున్నాయి.
-మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): లక్షల మంది ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం నిర్మించిన ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ది కూడా భూ నిర్వాసిత కుటుంబమేనని గుర్తుచేశారు. ఆయనకు భూనిర్వాసితుల కష్టాలు, సమస్యలు అందరికన్నా ఎక్కువ తెలుసన్నారు. వ్యవసాయంలో తెలంగాణ దేశానికే అన్నపూర్ణ అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మండుటెండల్లో ప్రాజెక్టులు, చెరువులు మత్తళ్లు దుంకడం 78 ఏండ్ల చరిత్రలో సువర్ణాధ్యాయమని తెలిపారు. కాళేశ్వరం నుంచి 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మకు గోదావరి జలాలను తరలించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు. అసాధ్యం అనుకున్నవన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుసాధ్యం చేసి చూపిస్తున్నారని స్పష్టం చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలని, ఇప్పుడు గోదావరి నీటితో భూగర్భ జలాలు ఆరు మీటర్ల పైకి ఎలా వచ్చాయన్న అంశంపై దేశంలోని కలెక్టర్లకు పాఠాలు చెప్పే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. చెరువులకు జలకళ వచ్చిందని, యాసంగి పంటల్లో తెలంగాణ నంబర్ వన్ అని చెప్పుకొనేలా పంటలు పండుతున్నాయని అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, సిరిసిల్ల, వేములవాడ, గంభీరావుపేట మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇల్లంతకుంటలో కొనుగోలు కేంద్రం, సెంట్రల్లైటింగ్, మహిళా కమ్యూనిటీ, రైతు వేదిక భవనాలను ప్రారంభించారు. వేములవాడలో వంద పడకల దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. సిరిసిల్లలోని జిల్లా గ్రంథాలయంలో ప్రొజెక్టర్ను ప్రారంభించారు. ఏరియా దవాఖానలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించి, కరోనా బాధితులకు ఇస్తున్న మందులు, ప్రజలకు వేస్తున్న టీకాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరుకు చేరుకుని మత్తడి దుంకుతున్న గోదావరి జలాలకు హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో అపురూపమైన, అద్భుతమైన రూపం సాక్షాత్కారమవుతున్నదని పేర్కొన్నారు. సముద్రమట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న కాళేశ్వరం నుంచి 618 మీటర్ల పైచిలుకు ఎత్తున ఉన్న కొండపోచమ్మ ద్వారా వట్టిపోయిన తెలంగాణలోని ఉపనదులను సైతం జీవనదులుగా మార్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎగువ మానేరు నింపాలని కేసీఆర్ ఎన్నో పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేశారని గుర్తుచేశారు. గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు, మంత్రులు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే గోదావరి జలాలు ఎదురెక్కి మండుటెండల్లో ఎగువ మానేరు మత్తడి నుంచి దుంకుతున్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతాంగం చిరకాల స్వప్నం సాకరమైనందుకు హృదయం ఉప్పొంగి పోతున్నదన్నారు. కూడవెల్లి వాగులోని అన్ని చెక్డ్యాంలు నింపుతూ ఎగువ మానేరును నింపినట్టు చెప్పారు. ఎగువమానేరు కింద మానేరు వాగులో 13 చెక్డ్యాంలు నిర్మిస్తున్నామని, అప్పర్ మానేరు నుంచి మధ్యమానేరు వరకు శాశ్వతంగా జలకళ ఉట్టిపడేలా గోదావరి జలాలతో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నదని వెల్లడించారు. తెలంగాణ సాధించింది, సిద్ధించింది ఎందుకో ఈ సుజల దృశ్యాన్ని చూస్తే ప్రజలకు అర్థమవుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు టీచర్లకు రూ.2 వేలు, బియ్యం ఇస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అంటే అది ఒక్క తెలంగాణలోనేనని గర్వంగా చెప్పవచ్చన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కరోనా సాకుతో ప్రైవేటు దవాఖానల యాజమాన్యాలు రోగుల నుంచి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ తరహా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
‘నీకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా? చేతనైతే కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా, మరిన్ని జాతీయ రహదారులు, నవోదయ పాఠశాలలు సాధించు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎంపీగా గెలిచి కరీంనగర్కు ఒక్క పైసా తెచ్చావా? అని ప్రశ్నించారు. మతం పేరిట రెచ్చగొడుతూ చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు కీళ్లు విరిచి వాతలు పెడుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం తమతో పోటీ పడాలని కేటీఆర్ హితవుపలికారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడితే కొత్త బిచ్చగాడని వదిలి పెట్టామని, దుబ్బాకలో గెలిస్తేనే ఎగిరెగిరి గెంతులేసినోళ్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. నాగార్జునసాగర్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారన్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ కృష్ణభాస్కర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.